Tuesday, May 27, 2014

సంక్షేమ పథకాలు/ఉచిత పథకాలు ఓట్లకి దగ్గర దారులా?

ప్రభుత్వాలన్నీ తమ సంక్షేమ పథకాల గురించి చాలా గొప్పగా వల్లె వేస్తున్నాయి. ఈ పథకాలు అవసరమా? అవసరం అయితే ఎంత వరకు? దానికి ప్రాతిపదిక ఏంటి?

మన రాష్ట్రంలో నేను గమనించినంతవరకు సంక్షేమ/ఉచిత పథకాలు ఓట్లు కొల్లగొట్టే మార్గాలుగా వాడింది మొదట రాజశేఖర్ రెడ్డి.  దాన్ని రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ల ప్రభుత్వాలు ముందుకు తీసుకుని వెళ్ళాయి. ఇప్పుడు పాత వాటిని కొనసాగిస్తూ అంతకు మించిన హామీలతో చంద్రబాబు, కెసిఆర్ ప్రభుత్వాలని ఏర్పాటు చేయబోతున్నారు. 

రాజశేఖర రెడ్డి మొదటి సారి అధికారం లోకి రావడానికి వాడిన బ్రహ్మాస్త్రం రైతులకి ఉచిత విద్యుత్. అప్పటికే వర్షాలు సరిగా లేక చితికిపోయిన రైతులకి అది ఒక అయాచిత వరంగా మారింది. అయితే ఇక్కడ మూడు విషయాలు. 
ఒకటి, ఒక చేత్తో ఉచిత విద్యుత్ ఇస్తూ రెండో చేత్తో నకిలీ ఎరువులు (కడప మాజీ మేయర్ లీలలు లాంటివి), నకిలీ విత్తనాలు కట్టడి చేయకుండా రైతులని ముంచారు. మాది రైతు కుటుంబం. అంతకు మునుపెన్నడూ ఎరువులకోసం, విత్తనాల కోసం లైన్లలో నిలుచుని తీసుకోవడం చూడలేదు. ఎరువుల విషయం కేంద్ర ప్రభుత్వ పరిధిలోది అయినా, ప్రభుత్వం రాష్ట్ర అవసరాలకి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవాలి. సరైన ఎరువులు , విత్తనాలు లేకుండా ఎంత విద్యుత్ ఇచ్చినా లాభం లేదు. 
ఇక రెండోది ఉచిత విద్యుత్ వల్ల బాధ్యత  లేకుండా భూగర్భ జలాలు తోడేయటం వల్ల భూగర్భ జలాలు అడుగంటే ప్రమాదం. 
మూడోది - ఖజానా మీద భారం. రిజర్వేషన్స్ లాగా దీనిని కూడా కనుచూపు మేరలో తీసేసే అవకాశాలు కన్పించడం లేదు. ఎందుకంటే తీసేసే ఆలోచన చేయగానే ప్రభుత్వాన్ని రైతు వ్యతిరేకి గా ముద్ర కొట్టడానికి ప్రతిపక్షాలు, పత్రికలూ సిద్ధంగా ఉంటాయి. 
అయితే కరువుతో అప్పుల ఊబిలో కూరుకు పోయిన రైతుకి ఇది స్వాంతన కలిగించిన్దనటం లో సందేహం లేదు. 

ఇక ఇప్పుడు కొలువుదీరబోతున్న చంద్రబాబు, కెసిఆర్ ఉచిత హామీలకైతే లెక్కే లేదు. ఉదాహరణకి రైతు రుణ మాఫీ. ఇది అధికారం లోకి రావడానికి ఉపయోగపడొచ్చు కానీ వేల కోట్ల ప్రజాధనం ఒక సెక్టార్ ప్రజలకి ఉపయోగించడం తప్పని నా అభిప్రాయం. మా ఊరిలోనే డబ్బు ఉన్నా తక్కువ వడ్డీ అని, ఇన్సూరెన్స్ వస్తుందని వ్యవసాయ రుణాలు తీసుకుని వేరే వాటికి వాడుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అవసరం లేకపోయినా ఋణం తీసుకుని వాడుకున్న వాళ్లకి ఇప్పుడు రుణ మాఫీ చేస్తే ఋణం తీసుకొని/తీసుకోలేని వాడితో పోలిస్తే అయాచితంగా ఒకటో, రెండో, మూడో లక్షలు అయాచితంగా వచ్చినట్లే. దాని వల్ల ఎంత ఆర్ధిక తారతమ్యాలు ఏర్పడతాయి? రిచ్ గెట్స్ రిచర్ అన్నట్లు ఉంటుంది. నిజంగా అప్పుల ఊబిలో కూరుకుపోయి దాని నుండి బయట పడలేని వాళ్లకి ఇది వరం కాదనను. అయితే ప్రభుత్వం బాధ్యత దానికి గల కారణాలు అన్వేషించి వాటినుండి బయట పడటానికి గల మార్గాలు అన్వేషించాలి. ఉదాహరణకి రైతుకి శీతల గిడ్డంగులు ఏర్పాటు చేయడం , దళారుల నుండి విముక్తి కలిగించి గిట్టుబాటు ధర అందేలా చూడటం, తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి రావడానికి గల మార్గాలు శోధించడం,  భూసార పరీక్షలు చేయించుకుని దానికి తగ్గట్టుగా సాధ్యమైనంత సేంద్రియ ఎరువులు వాడేలా రైతుల్ని చైతన్య పరచటం, రైతులు పండించింది మార్కెటింగ్ చేసుకోవడానికి, ఎగుమతి చేయడానికి సులువైన మార్గాలు సృష్టించడం, నాణ్యమైన ఎరువులు , విత్తనాలు ప్రదేశాలకి తగ్గట్టు అందేలా చర్యలు తీసుకోవడం ,  పండించిన ధాన్యాన్ని తరలించడానికి ప్రతి ఊరికి మంచి రహదారులు వేయడం, వ్యవసాయ ఉత్పత్తులకి విలువను జోడించే పరిశ్రమలని ప్రోత్సహించడం లాంటి దీర్ఘకాలిక ప్రణాలికలపై ఖర్చు పెడితే బాగుంటుంది. 

ప్రజలు ప్రభుత్వానికి పన్నులు కట్టేది పాలించమని అంతే కాని వాటిని వాడుకొని తను గద్దేనెక్కడానికి కాదు. ఎలాంటి హేతుబద్ధత లేకుండా, ఎలాంటి పరిమితులు లేకుండా పెట్టె ఇలాంటి పథకాల వల్ల ఒక వర్గపు ప్రజలకి మేలు కలగొచ్చు కానీ సమాజానికి ఏమి మేలు జరగదు. నిన్న ఉచిత విద్యుత్ , ఇవ్వాళ రుణ మాఫీ, రేపు పొద్దున్న డోస్ పెంచాలి కాబట్టి కుటుంబానికి సంవత్సరానికి లక్ష అంటూ మొదలు పెడతారు. వాళ్ళ సొమ్మేం పోయింది. అంతా ప్రజా ధనమే కదా. అలా అని కష్టం వస్తే వదిలేయమనట్లేదు కానీ దానికి ఒక హేతుబద్ధత ఉండాలి. శాస్త్రీయత ఉండాలి. ప్రజలు కట్టే పన్నులు ఒక వర్గానికి కాకుండా సమాజం మొత్తానికి మేలు చేసే విధంగా దీర్ఘ కాలిక ప్రణాలికలని తయారు చేయాలి. మనకి మిగులు ఉంటె వేరే విషయం కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో  ఇలాంటి ఉచిత హామీల వల్ల నిజంగా ఖర్చు పెట్టాల్సిన వాటి మీద పెట్టకుండా వెనకపడి పోతాం. 

చివరగా ప్రభుత్వాలు చేపలు ఎలా పట్టాలో నేర్పించాలి కానీ చేపల్ని చేతికి ఇచ్చే సంస్కృతి నుండి బయటపడాలి. Give a man a fish and you feed him for a day. Teach a man to fish and you feed him for a lifetime. దానికి ప్రతి పక్షాలు, ప్రజలు సహకరించాలి. 






No comments:

Post a Comment

Comments